పోస్ట్‌లు

వర్షపు జల్లులు | కవిత | మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"వర్షపు జల్లులు" మోహనకృష్ణ భార్గవ ఎండిన బతుకులు, పగిలిన గుండెలపై కరుణించి కురిసే తొలకరి జల్లులకై  ఎదురు చూస్తున్నాం.. కానీ..  ప్రచండ మారుతం విరుచుకుపడుతున్నది.. నీలి మేఘాలు కారుచీకట్లలా  గుడిసెలను   కమ్మేస్తున్నాయి..  చీకట్లోకి తోసేస్తున్నాయి.. వాసాలు తడకలు పైకెగసిపడ్తున్నాయి.. నానిన బియ్యపు గింజలు,  వెలగని పొయ్యి దీపం కడుపుకు బురదంటిన మరకలు,  పూటపూట ఆకలి యుద్ధం.. గుడిసె గుడిసెలను మింగుతున్న సుడిగుండాలు.. వైరపు వరుణుడి వైఖరి చూసి  నిస్సత్తువతో ఆకాశం వైపు చూసి రాలుతున్న కన్నీళ్లు.. వర్షాన్ని నిందించలేను,  పేదరికాన్ని భరించలేను.. చలనం లేని సమాజాన్ని అర్థించలేను.. కరుణలేని దైవాన్ని ప్రార్థించలేను.. వర్షపు జల్లుల తొలకరి పలకరింత  పులకరింతలను ఆస్వాదించి మురిసే శక్తి తాహతు మాకు లేవు.. అందరి పరీస్థితి ఒకటే కాదు..  చిరుజల్లులతో.. కొందరి పెదవులపై చిరునవ్వు విరబూస్తే.. మరికొందరి కంట కన్నీరు జారుతుంది.. ఐనా.. వర్షపు జల్లులను దోసిట్లో పట్టేందుకు.. మనసు చేయి చాస్తుంది.. ఆశతో.. ....................

ఆధ్యాత్మిక చైతన్యం - అరుణాచలం | స్మరణాత్ ముక్తిః | క్షేత్ర సమగ్ర విశ్లేషణ | మోహనకృష్ణ భార్గవ

చిత్రం
ఆధ్యాత్మిక చైతన్యం - అరుణాచలం    అరుణాచల శివ - స్మరణాత్ ముక్తిః శ్లో॥ దర్శనాత్ అభ్రసదసి, జననాత్ కమలాలయే। కాశ్యాంతు మరణాన్ ముక్తిః స్మరణాత్ అరుణాచలే ॥ లయకారకుడు, ఈశ్వరత్వం కలిగినవాడు పరమేశ్వరుడు. మనిషి మోక్షగామి., పునర్జన్మ లేనటువంటి శాశ్వత ముక్తిని కోరుకునే వారికి సాక్షాత్తూ పరమేశ్వరుడే ఉపదేశించిన ముక్తి మార్గాలు నాలుగు.. ఒకటి చిదంబరం లింగాన్ని దర్శించడం, రెండు కమలాలయం - తిరువారూర్ లో జన్మించడం, మూడు కాశీలో మరణించడం, నాలుగు అరుణాచల క్షేత్రాన్ని స్మరించడం.. అయితే పుట్టడం, గిట్టడం రెండు భగవంతుడి ఆటలే.! పైగా చిదంబర రహస్యాన్ని ఛేదించి ఆకాశ లింగాన్ని దర్శించడం అన్నది సామాన్యులకు సాధ్యం కాదు కదా.! ఇక ముక్తిని కోరే మానవులకు మిగిలిన ఏకైక మార్గం అరుణాచల క్షేత్ర స్మరణ మాత్రమే.! అందుకే అరుణాచలం ముక్తి మార్గంగా ఆరాధించబడుతుంది. కేవలం స్మరణ చేతనే ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రంగా అరుణాచలం కీర్తించబడుతుంది. అరుణాచల శివ.. అంటూ మూడుసార్లు పలికినంతటనే వేయి సార్లు కాశీ విశ్వనాథ స్వామిని దర్శించిన ఫలితం, కోటిసార్లు గంగానది స్నాన మాచరించిన పుణ్యఫలితాలు కలుగుతాయని పురాణాలు తెలుపుతున...

నవయుగ వ్యాస - పోతన | కవి | మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"నవయుగ వ్యాస - పోతన" కవిత - డా. మోహనకృష్ణ భార్గవ కర్షకుడివో కార్మికుడివో భారతావనిలో సాహితీ మందారాలను సేద్యం చేసావు.. సహజ పండితుడవో విరించి సహపాటివో శివ భక్తితో వీరభద్ర విజయాన్ని లిఖించి పద్య మాలికలతో ఈశ్వరార్చన జేసి జీవ పరమాత్మ  సోపాన తర్కమై ఛందస్సుకే చంద్రుడవై ఆచంద్రార్కం నిలిచావు.. శారదా పుత్రుడవై భాషోదయాన్ని గాంచి పండితుల పామరుల రసనపై నవరాసాలు పండించి నవవిధ భక్తి మార్గాలు బోధించి ప్రజల ధన్యుల జేసిన భాగ్య ఫల దాతగా సాహిత్య శబ్ధ విధాతవై నన్నయ తిక్కన సోమనల వారసుడవయ్యావు.. తెనుగు తోటలో బృందావన విహారిని గాంచి ఆలంబనగా ఆలింగనజేసి గోకులాన్ని తలపించే భాగవత కథామృతాన్ని విష్ణు భక్తి రసామృతాన్ని మధుర మాధురీ కవితామృతాన్ని జనులకు అందించగా సంజీవనీ కల్పతరువై బమ్మెరలో వెలసిన భాగవతోత్తముడవై విష్ణుకథా శిరోమణివై శుకముని సూక్తివై హరి భక్తుల ముక్తికి సోపానమైయ్యావు.. రామ భక్తుడవో ‌ రామ మిత్రుడవో పలికించువాడు రామభద్రుండేనంటూ భక్తిలో తడసిన కృతులతో ఆధ్యాత్మిక చైతన్య శృతులతో అలౌకిక తన్మయాన్ని కలబోసి రామచంద్రుని దర్శనమొందిన భక్త శిరోమణి మాట జ...

రవీంద్రనాథ్ టాగూర్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారాన్ని సొంతం చేసుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"రవీంద్రనాథ్ టాగూర్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారాన్ని సొంతం చేసుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ" - జనగామ బిడ్డ మోహనకృష్ణకు అరుదైన గుర్తింపు, ఇది జనగామాకు దక్కిన గౌరవంగా భావిస్తున్న ప్రజలు..  Dawn Research and Development Council (DRDC), ఇంటర్ గవర్నమెంట్, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సాహిత్య పురస్కార ప్రదానోత్సవానికి జనగామ జిల్లా‌ కేంద్రానికి చెందిన ప్రముఖ సాహిత్యకారుడు, కవి, రచయిత డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఎంపికయ్యారు,. డీ.ఆర్.డీ.సీ ఇంటర్నేషనల్ సంస్థ భార్గవకి "రవీంద్రనాథ్ టాగూర్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారం -2022" ని  ప్రకటించింది.  త్వరలో న్యూఢిల్లీ వేదికగా జరిగే సదస్సులో అంతర్జాతీయ ప్రముఖుల చేతులమీదుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయవలసివుండగా మోహనకృష్ణ వెళ్లలేని కారణం చేత వారు ధృవీకరణ పత్రాన్ని డిజిటల్ కాపీ ప్రతిని పంపించారు,. మరియు షీల్డ్, మొమెంటో, గుర్తింపు బాడ్జ్ వంటివి కొరియర్ ద్వారా పంపించనున్నట్లు తెలిపారు. మోహనకృష్ణ ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకురావడానికి నిరంతరం అందిస్తున్న సాహిత్యాన్ని, వారి రచనలు, పరిశోధనలను గు...

ఇండియన్ ఐకాన్ జాతీయ పురస్కారం అందుకున్న మోహనకృష్ణ భార్గవ

చిత్రం
"ఇండియా ఐకాన్" జాతీయ పురస్కారం, "దాదా సాహెబ్ ఫాల్కే -2023" పురస్కారం అందుకున్న మోహనకృష్ణ భార్గవ -  సామాజిక, సాహిత్య, సేవా రంగాలలో "ఇండియన్ ఐకాన్" జాతీయ పురస్కారం అందుకున్న జనగామ బిడ్డ మోహనకృష్ణ.. - ఉత్తమ లఘుచిత్ర దర్శకుడిగా దాదా సాహెబ్ ఫాల్కే 2023 పురస్కారంతో ఘన సత్కారం.. 29-04-2023, శనివారం,  సాయంత్రం : హైదరాబాద్ లోని ఎల్.వీ ప్రసాద్ డిజిటల్ ఫిల్మ్ ల్యాబ్స్ వేదికగా ఆర్.కే. కళా సాంస్కృతిక ఫౌండేషన్ మరియు తాండవం - ది స్కూల్ ఆఫ్ కూచిపూడి వారి సంయుక్త ఆధ్వర్యంలో దాదా సాహెబ్ ఫాల్కే 154 జయంతి సందర్భంగా జాతీయ పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు.  ఈ సభలో ప్రముఖ సినీతారలు, దర్శకులు, నిర్మాతలు, అతిరధమహారధుల సమక్షంలో, నిర్వాహకుల చేతుల మీదుగా జనగామ జిల్లా కు చెందిన ప్రముఖ సామాజిక కవి, రచయిత, లఘుచిత్ర దర్శకుడు డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ ను ఘనంగా సత్కరించారు.  (విజయచిత్ర - సినీ పత్రికలో ప్రచురితమైన వార్త) ఆర్.కే కళా సాంస్కృతిక సంస్థ నిర్వహించిన లఘుచిత్ర పోటిలో మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన "నవశకం - ఈతరం రైతన్న ప్రస్థానం" ఉత్తమ ల...

దోస్తు - పుస్తకం || కవిత || మోహనకృష్ణ భార్గవ

చిత్రం
" దోస్తు - పుస్తకం " కవిత ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా.. శుభాకాంక్షలతో.. మస్తిష్కాన్ని కదిలిస్తది, సమస్తాన్ని చూపిస్తది.. అజ్ణానాన్ని పడదోస్తది, చైతన్యాన్ని  కలిగిస్తది.. అస్తిత్వాన్ని కాపాడ్తది.. విశ్వాన్ని తనలో ఇముడ్చుకుంది.. ప్రకృతిని మదించి ఆకృతిలో‌ బంధించి.. అస్త్రమై శాస్త్రమై, జనన మరణాల సూత్రమై.. విశ్వాన్ని లిఖించిన జ్ఞాన భాండాగారైనది.. ఓటమి భయాన్ని చెరిపేస్తది.. ఒంటరి భావన దూరం చేస్తది.. కన్నీటిని తుడిచి ఆనందాన్ని నింపుతది.. నీడై నిలుస్తనంటది, తోడై నడుస్తనంటది.. ఎండిన మ్రానుకు జీవం పోస్తనంటది.. శిలను శిల్పంగా మార్చినట్లు.. పామరుడ్ని పండితుడ్ని చేస్తది.. చరిత్రలో శాశ్వతంగా నిలబెడ్తది.. తననెవరు దోచలేరని, దాచలేరని.. మురుస్తది‌‌.. నా దోస్తది..! డా. ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ సామాజిక కవి, రచయిత.. జనగామ - 7416252587

కలం మూగబోయింది || కవిత || మోహనకృష్ణ భార్గవ

చిత్రం
" కలం మూగబోయింది " కవిత మోహనకృష్ణ భార్గవ అబలలను కభలిస్తున్న ర్యాగింగ్ భూతాన్ని చూసి బలాత్కారాలకు బదులియ్యలేక నా కలం మూగబోయింది.. లీకుల పేరుతో కకావికలమై మట్టిపాలౌతున్న యువత చీకటి భవిష్యత్తు చూసి నా కలం మూగబోయింది.. దోపిడీ దొంగల చేతుల్లో పడి ఎండిన పేగుల ఆకలి కేకలు‌ విని చేయూతనివ్వలేని నిస్సత్తువతో నా కలం మూగబోయింది.. ప్రజాస్వామ్య గొంతుకకు అధికార మదం కళ్లెం వేస్తుంటే చేయెత్తలేక, నిలదీయలేక నా కలం మూగబోయింది.. ఖద్దరు, ఖాకీ దెబ్బలకు నలిగిన పేదల బతుకులు చూసి ఛిన్నమైన మనసుతో నా కలం మూగబోయింది.. శాలువా దుప్పట్లకు, జనాల చప్పట్లకు అంగట్లో సరుకై సలాం కొడుతున్న అక్షర యోధుల/బానిసల కలాల చూసి నా కలం మూగబోయింది.. డా. ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ సామాజిక కవి, రచయిత సెల్ : 7416252587 జనగామ జిల్లా..