శ్రీ వరలక్ష్మీ వ్రత విధానము
శ్రీ వరలక్ష్మీ వ్రతము
సనాతన సంస్కృతిలో.. వ్రత కర్మానుష్టాలు, వైదిక క్రతువులు, ఇతిహాస పౌరాణిక కథల్లో అనేక ధార్మిక సూక్ష్మ సూత్రాలు దాగివుంటాయి.. వాటికి అర్థం చేసుకుంటూ ఋజుమార్గంలో నడుస్తూ.. ధర్మబద్ధమైన, విలువలతో కూడిన జీవితాన్ని తద్వారా జీవితంలో సుఖసంతోషాలను, సమాజంలో గౌరవాన్ని జీవితానంతర శాశ్వత ముక్తిని పొందాలి..
పురాణాల్లో, శాస్త్రాలలో స్త్రీల కోసం వందకు పైగా వ్రతాలు చెప్పబడ్డాయి., కానీ ఇటీవల కాలంలో మహిళలు శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు.
అందుకు కారణం వరలక్ష్మీదేవి భోగభాగ్యాలకు, సిరి సంపదలకు, సౌభాగ్యానికి ప్రతీక అని.. అయితే మహిళలు వరలక్ష్మీ వ్రత ఆచరణలో దాగిన సూక్ష్మాన్ని మాత్రం గమనించట్లేదు.! భారీ ఏర్పాట్లతో ఘనంగా వ్రతాన్ని ఆచరించడమో, లేక మరే ఇతర ఆర్భాటాలు, దానాలు, సువాసినులకు వాయనాలు అప్పజెప్పడమో అంతరార్థం కానేకాదు.. మనలో దాగొని ఉన్న ఈర్ష్యాద్వేషాలను వదిలి, ప్రతీ స్త్రీలో కూడా లక్ష్మిని దర్శించి, పూజించి, గౌరవించాలి.,
"ఇందిరా ప్రతి గృహ్ణాతు, ఇందిరావై దాదాతిచ" దానం ఇచ్చేది లక్ష్మీయే, పుచ్చుకునేది కూడా లక్ష్మీయే.. పరస్పర సౌభాగ్యాలను పంచుకోవడమే లక్ష్మీప్రదం.. అదే మనకు సకల సౌభాగ్యాలను కలిగిస్తుంది.. తద్వారా పరస్పర గౌరవాలు, విలువలు, ఆప్యాయతలు పెంపొందిస్తుంది..
వరలక్ష్మీ వ్రతం ఆచరించడం అంటే కథ చదువుకోవడం అంతటితో వదిలేయడం కాదు.. కథ ద్వారా తెలుసుకున్న విషయాల ఆచరణ ముఖ్యం.. కేవలం కథ చదివితే ఏ పుణ్యము రాదు, కథలో చెప్పినట్లుగా మూడు ప్రదక్షిణలు చేయగానే ఏ భోగభాగ్యాలు ఉన్న ఫలంగా వచ్చిపడవు..
ముందుగా చారుమతికి వరలక్ష్మీ దేవి కరుణించి ఎందుకు అంతటి సౌభాగ్యాలను కలిగించిందో, మనకు ఎందుకు కలిగించట్లేదో బేరీజు వేసుకోవాలి.! వరలక్ష్మీయే స్వయంగా చారుమతి స్వప్నంలో సాక్షాత్కరించింది., అంటే చారుమతి ఎన్ని గంటలు పూజించి ఉంటుంది.? అంతటి గొప్ప తపస్సు ఏమి చేసుంటుంది.?
కథలో.. చారుమతి ఏ గొప్ప పూజలు చేయలేదు.! ఏ తపస్సు చేయనే లేదు.. కేవలం తన పాతివ్రత్య ధర్మాలను అనుసరించి.. నిత్యం భర్తను గౌరవించి పూజించింది, అత్తామామలను సేవించి తరించింది, పిల్లలకు ప్రేమ పంచింది పోషించింది, అతిథులను సత్కరించింది, సేవలందించింది, కుటుంబ గౌరవమర్యాదలు కాపాడేందుకు ఎంతో త్యాగం చేసింది., తన త్యాగాలను, సేవలను మెచ్చి కదా వరలక్ష్మీ అనుగ్రహించి.! ఇదే కదా అసలైన పాతివ్రత్యం.. పతివ్రతా ధర్మాన్ని సమాజానికి తెలియజేయడానికే సాక్షాత్ వరలక్ష్మీ దేవి చారుమతికి కృపకటాక్షాలతో అనంత ఐశ్వర్యాన్ని ప్రసాదించింది., అంతే కానీ వరలక్ష్మీకి గంటలు గంటలు పూజలు ఏనాడు చేయలేదు..
కనీసం భర్తను, అత్తమామలను గౌరవించని స్త్రీ ఎన్ని వ్రతాలు చేసినా నిష్ప్రయోజనమే అని గమనించాలి..!
వ్రత విధానం :
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించదలచిన మహిళలు శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం, పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం రోజున వ్రతాన్ని ఆచరించాలి. అందుకు ముందుగా గృహాన్ని శుద్ధి చేస్కోవలసివుంటుంది. ఆ తరువాత గృహాన్ని మంగళకరమైన ద్రవ్యాలు మామిడికొమ్మలు, పూలతో అలంకరించుకోవాలి. వ్రతం రోజున బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని పూజా మందిరాన్ని శుద్ధి చేస్కోవాలి., వ్రతానికి కావలసిన ద్రవ్యాలని సమకూర్చుకోవాలి. గృహంలో ఏదైనా ఒక ప్రదేశం లో వ్రతానికి మండపాన్ని ఏర్పాటు చేస్కోవాలి.
ముందుగా భర్త అనుమతి తీసుకుని, వారిచే అక్షతలు వేయించుకొని వ్రతానికి సిద్దమవ్వాలి.
మండపంపై బియ్యపు పిండితో ముగ్గులు వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి., అమ్మవారి పటం లేదా విగ్రహాన్ని అమర్చుకోవాలి. పూజాసామగ్రి, కంకణాలు, తోరణాలు, ప్రసాదాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.
కళశ పూజ, గణపతి పూజ, కంకణపూజ, వరలక్ష్మీ పూజ, వ్రత కథ శ్రవణం, నైవేద్యాలు నివేదన, నీరాజనం, ప్రదక్షిణలు, క్షమాప్రార్థన, ముత్తైదువుల పూజ, వాయనాలు, ఉపవాసం వ్రతంలోని ముఖ్యమైన విషయాలు.
కంకణం - తోరము
తెలుపు రంగు దారంతో ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసి ఐదు లేదా తొమ్మిది పూలు కడితే దానిని తోరం అంటారు. ఆ తోరాన్ని అమ్మవారి వద్ద పెట్టి అక్షితలు వేసి పూజించి ధరించాలి.
కలశపూజ :
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ: స్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥
అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజాద్రవ్యాలపైన పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.
గణపతి పూజ :
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే.
ఓం శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నేపశాంతయే.!!
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥
గణపతిపై అక్షతలు చల్లాలి.
శ్రీమహాగణాధిపతయే నమః, ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆసనం సమర్పయామి, పాదయేషు పాద్యం, హస్తయేషు అర్ఘ్యం, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి.. శుద్ధోదక స్నానం సమర్పయామి..!
అంటూ శుద్ధ జలాల్ని గణపతి పై జల్లాలి
శ్రీ మహాగణపతయే నమః వస్త్రార్థం, యజ్ఞోపవీతం, అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి.!
అంటూ అక్షతలు వేయాలి
గంధం సమర్పయామి..!
అంటూ గంధం, పసుపు, కుంకుమలు చల్లాలి.
అథ పుష్పై పూజయామి
(యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.)
ఓం సుముఖాయ నమః ,
ఓం ఏకదంతాయ నమః ,
ఓం కపిలాయ నమః ,
ఓం గజకర్ణికాయ నమః ,
ఓంలంబోదరాయ నమః ,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి.! అంటూ స్వామిపై పుష్పాలు ఉంచాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు నైవేద్యాన్ని ఉంచి నివేదించాలి.
(దూపం వేసి లేదా అగరువత్తులు వెలిగించాలి., దీపాలను చూపాలి..)
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్!!
నీటిని నైవేద్యాల చుట్టూ జల్లుతూ ...
సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి...
ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా.. (అంటూ నైవేద్యాలు చూపాలి.)
గుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనం సమర్పయామి. (తాంబూల సమర్పించాలి)
కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి!
అనేన గణాధిపతి పూజనేన భగవాన్ సర్వాత్మకః
శ్రీ గణపతి దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు!
వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.
వరలక్ష్మీ పూజ :
శ్లో. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే ,
నారాయణ ప్రియేదేవి సుప్రీతా భవ సర్వదా .
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే ,
సుస్థిరా భవమే గేహే సురాసురనమస్కృతే.!!
వరలక్ష్మీ దేవతాం ధ్యాయామి..!
అంటూ వరలక్ష్మీదేవిని ధ్యానించి ఆవాహన చేయవలెను. అక్షితలు వేయాలి..
శ్రీ వరలక్ష్మై నమః, ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆసనం సమర్పయామి, పాదయేషు పాద్యం, హస్తయేషు అర్ఘ్యం, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి.. శుద్ధోదక స్నానం సమర్పయామి..!
అంటూ శుద్ధ జలాల్ని వరలక్ష్మి పై జల్లాలి
వస్త్రార్థం, ఉపవీతార్థం, అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి.! అంటూ అక్షతలు వేయాలి
గంధ ద్వారాం దురాదర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్
ఈశ్వరీగుం సర్వ భూతానం తామియోపహ్వయే శ్రియమ్.!
గంధం సమర్పయామి..!
అంటూ గంధం, పసుపు, కుంకుమలు చల్లాలి.
అధాంగపూజ:-
పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.
చంచలాయై నమః - పాదౌ పూజయామి,
చపలాయై నమః - జానునీ పూజయామి,
పీతాంబరాయైనమః - ఉరుం పూజయామి,
మలవాసిన్యైనమః - కటిం పూజయామి,
పద్మాలయాయైనమః -నాభిం పూజయామి,
మదనమాత్రేనమః - స్తనౌ పూజయామి,
కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి,
సుముఖాయైనమః - ముఖంపూజయామి,
సునేత్రాయైనమః - నేత్రౌపూజయామి,
రమాయైనమః - కర్ణౌ పూజయామి,
కమలాయైనమః - శిరః పూజయామి,
శ్రీవరలక్ష్య్మైనమః - సర్వాణ్యంగాని పూజయామి.
తరువాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి.
శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓం బుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం లోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
అష్టోత్తర శతనామార్చన పూజ పూర్తి చేసి కంకణాన్ని అమ్మవారి వద్ద పెట్టి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.
కంకణపూజ :-
కమలాయైనమః - ప్రథమగ్రంథిం పూజయామి,
రమాయైనమః - ద్వితీయ గ్రంథింపూజయామి,
లోకమాత్రేనమః - తృతీయ గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః - చతుర్థగ్రంథింపూజయామి,
మహాలక్ష్మ్యై నమః - పంచమగ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః - సప్తమగ్రంథిం పూజయామి,
చంద్రసోదర్యైనమః - అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః - నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే
కంకణ ధారణ అనంతరం దూపం వేసి, నైవేద్యం నివేదన చేయాలి, మంగళహారతులు అమ్మ వారికి చూపాలి., మంత్రపుష్పం చెప్పి, అనంతరం మూడు ప్రదక్షిణలు చేయాలి..
తరువాత కథ పారాయణం చేయాలి..
కథా ప్రారంభం :
శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా.! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి.
పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు.
ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి.. ఓ నాథా! స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ.! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.
అప్పుడు పార్వతీదేవి.. దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు.? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.
అందుకా శివుడు.! కాత్యాయనీ... పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు ప్రాకార కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతః కాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతఃకాల గృహ కృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ గౌరవంగా ఉండేది.
వరలక్ష్మీ సాక్షాత్కారం :
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ.. ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. "హే జననీ! నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.
అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని ముత్తైదువలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో..
సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !!
అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.
అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.
మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జేలు ఘల్లు ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి.మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వా భరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.
వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు.
మునులారా.. శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నాను ఈ వ్రతం చేసినను ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలిగుతాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.
శ్రీ వరలక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు..!
అంటూ అక్షతలు శిరసుపై వేసుకోవాలి., తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి, ముత్తైదువులను పూజించి వాయన దక్షిణ తాంబులాదులు, పసుపు కుంకుమలు పంచుకోవాలి. ఉపవాస దీక్ష పూర్తి చేయాలి.!
సర్వే జనాః సుఖినో భవంతు..!
డా. ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ..
జ్యోతిష్య రత్న, జ్యోతిష్య శిరోమణి, జ్యోతిష్య మహర్షి
అంతర్జాతీయ జ్యోతిష్యశాస్త్ర పురస్కార గ్రహీత
without pooja knowledge person also can do this pooja.
రిప్లయితొలగించండిyour giving that much energy.
thanks guruji🙏💐🙏